18-11-2025 07:34:20 PM
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు నోముల శంకర్ యాదవ్..
నకిరేకల్ (విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేసి విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు నోముల శంకర్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలుకాలేదని తీవ్రంగా విమర్శించారు. రెండు అకాడమిక్ సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
సర్టిఫికెట్లు తీసుకోవడానికి తల్లిదండ్రులు ఆస్తులు తాకట్టు పెట్టే స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదవాడికి విద్యను అందని ద్రాక్షగా మార్చిందని ఆయన విమర్శించారు. విడతల వారి కాకుండా ఒకేసారి ఫీజు రీయింబర్స్మెంట్ను విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆయన కోరారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కాస్మోటిక్స్, పోస్ట్మెట్రిక్ చార్జీలు పెంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.