19-08-2025 01:01:27 AM
ఘట్ కేసర్, ఆగస్టు 18 : మోటార్ సైకిల్ పై ఎండు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 4.900 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చర్లపల్లి నుండి చెంగిచర్లకు వెళ్లే రహదారిపై సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా వెళ్తున్న మోటార్ సైకిల్ (TS 07 JM 8639) ఆపి తనిఖీ చేశారు.
అతని వద్ద 4.900 కిలోల ఎండు గంజాయి పొట్లాలను గుర్తించారు. వెంటనే బైక్ నడుపుతున్న వ్యక్తిని పట్టుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పారిపోయాడు. అరెస్ట్ అయిన వ్యక్తి ఒడిశాకు చెందిన కిషోర్ మల్లిక్ (31) పరారైన వ్యక్తి మౌలాలికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ముజీబ్ గా విచారణలో తేలింది. ఒడిశా నుంచి తెచ్చిన ఎండు గంజాయి కిలో రూ. 7వేల చొప్పున మహమ్మద్ అబ్దుల్ విక్రయిస్తున్నట్లుగా గతంలో 3 నుండి 5 సార్లు ఒడిశా నుండి హైదరాబాద్ కు గంజాయి తీసుకొచ్చానని పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం కిషోర్ మల్లిక్, మొహమ్మద్ అబ్దుల్ ముజీబ్ లపై కేసు నమోదు చేసి కిషోర్ మల్లిక్ ను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.