25-07-2024 12:08:17 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యులైన మహిళలను పారిశ్రామికవేత్తలను చేసేందుకు సర్కారు మహిళా శక్తి పథకంలో భాగంగా 7 వేల యూనిట్లు మంజూరు చేసినట్లు జీహెచ్ఎంసీ యూసీడీ అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్రెడ్డి తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రాజెక్టు అధికారులు, టౌన్ లెవల్ ఫెడరేషన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహిళలు క్యాంటీన్స్, క్యాటరింగ్, పిండి వంటలు, బోటిక్స్, పిండి గిర్నీ, డీటీపీ జిరాక్స్ సెంటర్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కోల్డ్ స్టోరేజ్, మీ సేవ సెంటర్స్, పచ్చళ్లు, పొడులు, పాల ఉత్పత్తులు, హ్యాండ్ మేడ్ క్రాప్ట్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ దుకాణాలు, కిరాణా దుకాణాలు, నర్సరీలు నిర్మాణపరమైన సామగ్రి యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం సాయం అందిస్తుంద న్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల లీడ్ బ్యాంక్ మేనేజర్లు, మెప్మా అధికారులు పాల్గొన్నారు.