27-10-2025 01:18:38 AM
నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
మేడ్చల్, అక్టోబర్ 26(విజయ క్రాంతి): గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుతారిగూడా చెరువులోకి మురుగు నీరు చేరేలా పైప్ లైన్ వేయడం పట్ల గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కండ్లకోయ లోని బొడ్రాయి నుండి ఆ గ్రామంలోని చెరువు అలుగు వరకు మురుగునీటి పైప్ లైన్ వేస్తున్నారని ఆ మురుగునీరు సుతారిగూడ చెరువులోకి వస్తుందని తెలిపారు.
ఇప్పటికే సీఎంఆర్ కాలేజీ, హాస్టల్లో నుంచి భారీగా మరుగు నీరు సుతారిగూడ చెరువులోకి వస్తోందన్నారు. కండ్లకోయ నుంచి కూడా మురుగునీరు వస్తే చెరువు మురికి కూపంలా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు చేరడం వల్ల దుర్వాసన రావడమే గాక దోమల బెడద ఎక్కువ అవుతుందంటున్నారు.
కొందరి స్వార్థం కోసం సుతారిగూడ గ్రామస్తులను బలి చేస్తున్నారని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాగరబోయిన మల్లేష్ ముదిరాజ్ మండిపడ్డారు. ఇప్పటికే మురికి నీరు భారీగా వస్తుందని, మున్సిపల్ అధికారుల చర్యల వల్ల మరింత వచ్చే అవకాశమందున్నారు. పైప్ లైన్ పనులు వెంటనే ఆపాలని, లేకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.