calender_icon.png 24 October, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపారాన్ని అడ్డుకున్నందుకే కాల్పులు!

24-10-2025 12:30:47 AM

  1. పోచారంలో కాల్పుల కేసులో ముగ్గురు అరెస్టు, పరారీలో ఒకరు 
  2. రాచకొండ సీపీ సుధీర్‌బాబు 

ఎల్బీనగర్, అక్టోబర్ 23: తన వ్యాపారాన్ని అడ్డుకుంటూ, ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడనే కక్షతోనే పోచారంలో గోరక్షకుడిపై నిందితుడు కాల్పులు జరిపాడని రాచకొండ సీపీ పేర్కొన్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారని తెలిపారు. గురువారం ఎల్బీనగర్‌లోని కమిషనర్ సుధీర్ వివరాలు వెల్లడించా రు.

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతబస్తీ బండ్లగూడకు చెందిన మహమ్మద్ ఇబ్రహీం(24) పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని హ నుమాన్ జంక్షన్ నుంచి ఆవులను కొనుగోలు చేసి హైదరాబాద్ నగరంలోని కబే ళాలకు తరలిస్తున్నాడు. కీసర మండలం రాంపల్లిలో నివాసం ఉండే బిడ్ల ప్రశాంత్‌కుమార్ అలియాస్ సోనూసింగ్(28) గోరక్షక్ సభ్యుడిగా పని చేస్తున్నాడు. సోనూసింగ్, షాబాద్‌కు చెందిన కురువ శ్రీనివాస్(29) స్నేహితుడు.

సోనూసింగ్ పలుచోట్ల గోవుల తరలింపును అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం గోవులను తరలిస్తున్న ఇబ్రహీంను ఘట్‌కేసర్ మండలం య మ్నాంపేట్ చౌరస్తా ఔటర్ రింగ్ వద్ద పోలీసులకు పట్టించాడు. దీంతో సోనూసింగ్‌పై ఇబ్రహీం కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో షాబాద్‌కు చెందిన కురువ శ్రీనివాస్ మధ్యవర్తి ద్వారా మాట్లాడుకుందామని, పాతబస్తీ వైపు రావాలని చెప్పాడు.

అయితే, సోనూ సింగ్ అక్కడ వద్దు మీరే యమ్నాంపేట్ సమీపంలోని టీ స్టాల్ వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో ఇబ్రహీం ఖురేషి, మహమ్మద్ హనీఫ్ ఖురేషి(24), కురువ శ్రీనివాస్, హస్సన్ బిన్ మోసిన్(22) అక్కడికి వచ్చారు. ఆ సమయంలో సోనూసింగ్, ఇబ్రహీం గంటసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరి మధ్య వాగ్వా దం పెరిగింది. దీంతో ఇబ్రహీం రివాల్వర్‌తో సోనూసింగ్‌ను కుడివైపు ఛాతి పై కాల్చాడు.

మరో బుల్లెట్ ఛాతి ఎడమ వైపు నుంచి దూసుకెళ్లింది. దీంతో రక్షించాలని సోనూసింగ్ కేకలు వేసుకుంటూ రోడ్డుపైకి పరుగు లు తీసి కుప్పకూలాడు. ఇబ్రహీం స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. కిందప డిపోయిన సోనూసింగ్‌ను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సోనూసింగ్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం సోనూసింగ్ పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు.

మహమ్మద్ ఇబ్రహీం, కురువ శ్రీనివాస్, హస్సన్ బిన్ మోసిన్‌లను అరెస్ట్ చేసినట్లు, మరో నిందితుడు మహమ్మద్ హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. అయితే, ఆరు నెలలుగా సోను సింగ్‌తో ప్రధాన నిందితుడు ఇబ్రహీం ఖురేషి రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు తెలిపారు.  ముందస్తు ప్రణాళిక ప్రకారం కాల్పులు జరిపారని సీపీ తెలిపారు. నిందితుల వద్ద దేశీ య పిస్టల్, స్విఫ్ట్ కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.