19-09-2025 01:09:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఇటీవల హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత ఆదివారం కుండపోత వానకు మెహిదీపట్నం మంగర్ బస్తీ నాలలో వరద నీటిలో కొట్టుకుపోయిన మామాఅల్లుళ్లలో, అల్లుడి మృతదేహం ఐదు రోజుల తర్వాత గురువారం లభ్యమైంది.
ఘటన స్థలానికి దాదాపు 70 కిలో మీటర్ల దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం బీమా లింగం కత్వా వద్ద మూసీ ప్రవాహానికి ఓ మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం, అర్జున్ కుటుంబ సభ్యులకు ఫొటోలు పం పించగా, వారు దుస్తులు, ఇతర గుర్తుల ఆధారంగా అది అర్జున్ మృతదేహమేనని నిర్ధారించారు.
దీంతో ఆ కుటుంబంలో విషా ద ఛాయలు అలుముకున్నాయి. తమ పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, గల్లంతైన మామ కోసం అధికారులు గాలింపును ముమ్మరం చేశారు.
ఈ నెల14న మెహిదీపట్నం సమీపంలోని మంగర్ బస్తీకి చెందిన మామ, అల్లుడు అర్జున్ (32) ప్రమాదవశాత్తు నాలా ప్రవాహంలో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృం దాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. అల్లుడి మృతదేహం గురువారం లభ్యం కాగా.. మామ అచూకీ ఇంకా కానరాలేదు.