calender_icon.png 22 August, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీల్లో నాణ్యమైన విద్య బోధనకు చర్యలు: కలెక్టర్ అభిలాష అభినవ్

22-08-2025 06:27:08 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ గ్రామీణ మండలం అనంతపెట్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్‌రూమ్, వంటగది, డైనింగ్‌హాల్‌ను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యుత్, తాగునీరు, బాత్రూం వంటి సదుపాయాలు సక్రమంగా వినియోగంలో ఉన్నాయా అనే అంశాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రభుత్వ కేజీబీవీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. సమస్యలేవైనా వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించేలా పాఠశాల ప్రాంగణంలో బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ మైదానాల కోసం ల్యాండ్ లెవెలింగ్ పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.