31-01-2026 12:45:47 AM
కామారెడ్డి, జనవరి 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థినిలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకునే దిశగా విజయవాడలోని రీజనల్ సైన్స్ సెంటర్ను ఇస్రో సందర్శనలో భాగంగా శుక్రవారం సందర్శించారు. .జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక అనుమతితో, జిల్లా సైన్స్ అధికారి మోతె సిద్ధారం రెడ్డి ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపికైన 50 మంది విద్యార్థులు, 30 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విజయవాడ రీజినల్ సైన్స్ సెంటర్లో విద్యార్థులకు లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో రూపొందించిన అనేక శాస్త్రీయ యాక్టివిటీస్, మోడల్స్, ప్రయోగ పరికరాలను ప్రత్యక్షంగా పరిచయం చేశారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, అంతరిక్ష విజ్ఞానం, గణితం వంటి విభాగాలకు చెందిన పరికరాల ద్వారా శాస్త్రీయ సూత్రాలు ఎలా పనిచేస్తాయో విద్యార్థులు స్వయంగా చేసి చూడడం ద్వారా అవగాహన పొందారు.
ప్రత్యేకంగా లీవీ మెథడ్ (Levy Method) ఆధారంగా రూపొందించిన ఇంటరాక్టివ్ పరికరాలు విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాయి. భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి విద్యా విహారయాత్రలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా సైన్స్ అధికారి సిద్ధరామ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ కు ,జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యస్ రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్దరాం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.