04-08-2025 12:45:00 AM
ఎండవేడికి చనిపోయిన కోళ్లు
మహబూబాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఆగస్టు నెల అంటేనే వర్షాకాలానికి గుర్తు. అటువంటిది ఎండల తీవ్రత పెరిగిపోయి జనం విలవిలలాడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలోని తావూరియా తండా లో ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరా అంతరాయం వల్ల మూడు గంటలు విద్యుత్తు నిలిచిపోవడంతో బాయిలర్ కోళ్ల ఫామ్ లో ఎండ తీవ్రతకు తట్టుకోలేక సుమారు 200 కోడి పిల్లలు మృత్యువాత పడ్డాయి. తండాకు చెందిన మూడవత్ బుజ్జి హక్యా కోళ్ల ఫారం నిర్వహిస్తుండగా అందులో బాయిలర్ కోళ్లను పెంచుతున్నారు.
ఈ క్రమంలో విద్యుత్ లైన్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్తు సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమత్తు పనులు చేపట్టారు. దీనితో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎండ తీవ్రతకు తట్టుకోలేక కోళ్ల షెడ్డులో ఉన్న కూలింగ్ ఫ్యాన్లు పనిచేయకపోవడంతో సుమారు 200 కోడి పిల్లలు మృత్యువాత పడ్డాయి. దీంతో 50 వేల రూపాయలు నష్టపోయినట్లు బాధితులు తెలిపారు.