శిక్షణలో సర్వే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి..
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య..
హనుమకొండ (విజయక్రాంతి): లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కార్యక్రమంలో సర్వేకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య(District Collector Pravinya) అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రం(Technical Training and Development Center)లో జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో సర్వే నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై నిర్వహిస్తున్న బోధనా తరగతులను, అంశాలను పరిశీలించారు.
శిక్షణార్థులకు సంబంధించిన మెటీరియల్ను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ... లైసెన్స్ సర్వేయర్లకు 50 రోజులపాటు నిర్వహించే శిక్షణ కాలంలో సర్వేకు సంబంధించిన అన్ని అంశాలపై పట్టు సాధించే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని ప్రతిభ కనబరిచిన వారికి భూభారతి సర్వే చేసేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడి శ్రీనివాసులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






