ఉపాధ్యాయుల పదోన్నతులను పారదర్శకంగా చేపట్టాలి
సూర్యాపేట (విజయక్రాంతి): ఉపాధ్యాయుల పదోన్నతులను పారదర్శకంగా చేపట్టాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతిలాల్ నాయక్(Secretary Dharawat Motilal Naik) అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని తెలిపారు. త్వరలో జరగబోయే ఉపాధ్యాయ పదోన్నతులను ఎలాంటి పొరపాటు జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.
ఉద్యోగస్తులకు వెంటనే పిఆర్సి అమలు చేయాలని, పెండింగ్ లో 5 డిఎలను వెంటనే ప్రకటించాలన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్సును వెంటనే రిలీజ్ చేసి ఉద్యోగుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ బిల్లులు ప్రతినెల 700 కోట్లు రిలీజ్ చేస్తామని ప్రభుత్వ ప్రకటించి ఇప్పటివరకు ఒక్క పైసా కేటాయించకపోవడం కరెక్ట్ కాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ధరావత్ వస్త్రం నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్ర బగ్గులాల్ నాయక్, లింగా నాయక్ రమేష్ బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.






