04-09-2025 10:11:05 PM
భద్రాచలం (విజయక్రాంతి): ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ వారి ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖలో పనిచేయుచున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్మానించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకులకు అభినందిస్తున్నట్లు డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ(DD Tribal Welfare Officer Manemma) అన్నారు. గురువారం నాడు భద్రాచలం పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి భద్రాచలం వారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు పనిచేయుచున్న ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన విద్యార్థిని విద్యార్థులకు విద్యాభివృద్ధి కొరకు అహర్నిశలు పాటుపడుతున్న గిరిజన ఉపాధ్యాయులకు ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ వారు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి వారిని సన్మానించడం చాలా సంతోషంగా ఉందని, ఈ సన్మానాన్ని ఉపాధ్యాయులు అదృష్టంగా భావించి గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు వారి భవిష్యత్తును బాగుపరిచేలా వారి విద్యాభివృద్ధి కొరకు కృషి చేయాలని అన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖలో పనిచేయుచున్న 28 మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు శాలువాలు మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి సమాజం నిర్వాహకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.