27-09-2025 11:15:59 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): వికలాంగుల సంక్షేమంపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం జిల్లా మహిళా శిశు సంక్షేమ, వయోవృద్ధుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఐటిఐ ప్రాంగణంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 138 మంది వికలాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్యలు ముఖ్య అతిథులు హాజరై పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
16 మంది వికలాంగులకు బ్యాటరీతో నడిచే సైకిళ్లు, 36 మంది వికలాంగులకు ట్రై సైకిళ్లు, 35 మంది వికలాంగులకు వీల్ చైర్లు, 15 మంది వికలాంగులకు మీడియం సైజ్ కుర్చీలు, 15 మందికి లాడ్జ్ సైజ్ కుర్చీలు, 11 మంది వినికిడి లోపం ఉన్నవారికి హియరింగ్ బర్డ్స్, పదిమంది అందులకు బ్లైండ్ వాకింగ్ స్టిక్ లు పంపిణీ చేశారు. వికలాంగులు తమ అవిటితనాన్ని చూసి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో రాణించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి లలితకుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.