23-04-2025 10:40:23 PM
మరణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకం..
మంథనిలో ఉగ్రవాదుల చేతులో మృతి చెందిన వారికి కొవ్వొత్తుల ర్యాలీలో యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు..
మంథని (విజయక్రాంతి): భారతదేశంలో మతం పేరుతో ఉగ్రముఖాలు మరణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలో బుధవారం రాత్రి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ ప్రధాన రహదారిపై పహల్గాములో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జమ్ము కాశ్మీర్ పాహల్గామ్ లో ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నామన్నారు. మృతి చెందిన వారికి సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
భారతదేశంలో మతం పేరుతో ఉగ్రముఖాలు మరణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకం అన్నారు. పర్యాటకులను, సామాన్య ప్రజలను చుట్టుముట్టి ఆటవికంగా హత్య చేసి గెలిచామనుకోవడం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఉగ్ర మూకల దాడిలో ఆగిన ఊపిరి ప్రతి భారతీయుల్లోనూ ఉద్రేకాన్ని రగిలించిందన్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మతం ముసుగులో దాడి చేసిన మతోన్మాద ఉగ్రవాదుల చర్యలను, దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని, ఉగ్రమూకల రియాక్షన్ కు భారత ప్రభుత్వం సరైన సమాధానం చెప్పే పనిలో ఉందనీ, ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని శ్రీను బాబు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పోలు శివ, మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రూ రమాదేవి, పీఏసీ ఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ మస్కుల సురేందర్ రెడ్డి, ముత్తారం, కమాన్పూర్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, వైనాల రాజు, యూత్ మండల అధ్యక్షులు శ్రీకాంత్, రేబల్ రాజ్ కుమార్, బక్కతట్ల వినీత్ యాదవ్ నాయకులు వనం రామచంద్ర రావు, తదితరులు పాల్గొన్నారు.