15-01-2026 03:08:05 AM
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి, జనవరి 14 (విజయక్రాంతి): అర్ధరాత్రి ఎన్టీవీ జర్నలిస్టుల ను సిట్ అధికారులు అరెస్టు చేయడం సరికాదని, సిట్ అధికారులు సంయమనం పాటించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఒక మహిళ అధికారిపై ఇలాంటి వార్తలు రాయడాన్ని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాల్సిం దేనన్నారు. కానీ సిట్ అధికారులు ఈ విషయంలో చాలా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎవరి మీద అయితే అనుమానం ఉన్నదో.. ఎవరినైతే విచారణ చేయాలని అనుకుంటున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే బాగుండేదన్నారు.
పండుగ వేళ సీనియర్ జర్నలిస్టులను విచారణ పేరుతో అర్ధరాత్రి అరెస్టులు చేసి తీసుకెళ్లడం వల్ల ప్రభుత్వం కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారన్న వార్త ఒక భయాందోళనకు దారి తీస్తుందని, ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా ఉపయోగపడే పరిస్థితి ఉందన్నారు.