23-12-2025 01:17:01 AM
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప గా మార్చి, బాధ్యాతరహితంగా వ్యవహరించిన కేసీఆర్ పాలనే దద్దమ్మ ప్రభుత్వమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల త ర్వాత జరిగిన పార్లమెంట్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు కండ కరిగిపోయి కేవలం తోలు మాత్రమే మిగిలిందని అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మంత్రులు వాకిటి శ్రీహరి, పొ న్నం ప్రభాకర్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కో ల్పోతోందన్నారు.
అందుకే కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసమే ఇప్పుడు రెండేళ్ల తర్వాత బయటికి వస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పతనానికి కేసీఆర్ కు టుంబ రాజకీయాలే ప్రధాన కారణమని మంత్రి జూపల్లి ఆరోపించారు. కొడుకు, అల్లుడు వ్యవహారశైలి వల్లే ప్రజల్లో ఆదరణ తగ్గిందనే విషయం కేసీఆర్కు ఆలస్యంగా అర్థమైందన్నారు. అందుకే పార్టీని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజలముందుకు వస్తు న్నారని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేసినా ప్రజలు వారికి మూడింట ఒక వంతు సీట్లు కూడా ఇవ్వలేదన్నారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. రోజురోజుకూ బలహీనపడుతన్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫా మ్హౌస్ వదిలి బయటకు వచ్చారే తప్ప.. పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ కాదు.. గాడి ద గుడ్డు అంతకన్నా కాదని మంత్రి హితవు పలికారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పదేళ్ల కాలంలో ఎందుకు నిర్లక్ష్యం చేశా రో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి తాగునీటి ప్రాజెక్టు అని సుప్రీంకోర్టులో కేసు వేసిన కేసీఆర్.. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టు ఎలా అవుతుం దో చెప్పాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను తిరస్కరించినట్లు కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత కాంగ్రెస్ పాలనలోనే జూరాల నుంచి 70 టీఎంసీలకు మంజూరైందని మంత్రి వివరించారు.
కేసీఆర్ మళ్లీ పాత పురాణమే మొదలు పెట్టారు : మంత్రి వాకిటి
కేంద్రం ఏపీకే నిధులు ఇస్తూ.. తెలంగాణపై వివక్షత చూపిస్తోందనే విషయంపై కేసీఆర్ మాట్లాడుతారనుకుంటే.. మళ్లీ పాతపురాణమే మొదలు పెట్టారని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. కేసీఆర్కు పాలమూరులో ఊరు, పేరు లేకున్నా ఎంపీ గా గెలిపించినా, పదేళ్లు అధికారంలో ఉన్నా పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారోననే సోయి లేకుండా మళ్లీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సంఘం బండ, భూత్పూర్ ప్రాజె క్టులో బండ పగలగొడితే 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనే ఆలోచన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని మంత్రి వాటికి విమర్శించారు. కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి పాలమూరుపై చర్చ చేయాలని కోరారు.
తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకే ఉంది : మంత్రి పొన్నం
తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నామని, అందుకే తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉపఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమకు పట్టం కట్టారని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఫామ్హౌస్ నుంచి బయటికి వచ్చిన కేసీఆర్.. తమ తోలు తీస్తామని మాట్లాడిన తీరు ఆక్షేపనీయంగా ఉందన్నారు. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉందన్నారు.
పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లోనూ ‘ప్రజలు మీ తోలునే తీశారనే విషయం గుర్తుంచుకోవాలి’ అని మంత్రి పొన్నం హితవు పలికారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సోనియాగాంధీకి లేఖ రాయడం కంటే.. 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు ఏమి చేసిందో లేఖ రాయాలని మంత్రి పొన్నం హితవు పలికారు. కేసీఆర్ మెప్పు కోసమే కిషన్రెడ్డి లేఖరాసినట్లుగా ఉందన్నారు.