31-07-2025 12:00:00 AM
నంగునూరు, జూలై 30: పదేళ్లుగా నంగునూరు మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్ కార్డులు పంపిణీ చేయలేదన్న మంత్రి వివేక్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ నంగునూరు మండల అధ్యక్షుడు అనుగొని లింగం గౌడ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు వివేక్, రేవంత్ రెడ్డిలు అబద్ధాలు మాట్లాడటం మానుకోవాలన్నారు.
అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేయకూడదని హెచ్చరించారు. విధులు సక్రమంగా నిర్వహించని పక్షంలో లబ్ధిదారుల పక్షాన ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల విషయంలో అధికారులు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రోజులను తిరిగి తెచ్చిందని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
రైతులు వానాకాలం రాగానే ఎరువుల దుకాణాల ముందు చెప్పులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని, కరెంటు కొరత తీవ్రమైందని, వరికుప్పల వద్ద రైతులు చనిపోవడం మళ్లీ పునరావృతమైందన్నారు. పాత రోజులు తెస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెచ్చి చూపిస్తోందనీ ఎద్దేవా చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అవివేకంతో మాట్లాడడం సిగ్గుచేటని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి విమర్శించారు.
బిఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు మాటలు చెబుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాగుల సారయ్య, పిఎసిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, నాయకులు కృష్ణారెడ్డి, పురందర్, పరశురాములు, కర్ణకంటి వేణు, బెదురు తిరుపతి, రాజయ్య కనుకుయ్య , దేవులపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.