08-07-2025 07:36:35 PM
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఐటిడిఏ ఏఓ కి వినతిపత్రం..
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్ డిమాండ్..
భద్రాచలం (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్(SFI District Vice President Koppula Ravinder) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఐటిడిఏ ఏఓ రాంబాబుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,158 వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత చదువులకి వెళ్లకుండా నష్టపోతున్నారని అన్నారు.
స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సర్టిఫికెట్ల కోసం కాలేజీల యజమాన్యం డబ్బులు డిమాండ్ చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని అన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించలేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర దేవా మహేష్ రంజిత్ సాగర్ సురేష్ కుమార్ రేవంత్ తదితరులు పాల్గొన్నారు.