06-11-2025 12:00:00 AM
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 5 (విజయక్రాంతి): ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని, ఎవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా విస్తృత ప్రచా రం నిర్వహించారు. ఎల్లారెడ్డిగూడ, కమలాపురి కాలనీ, ఇమాంగూడ, జయప్రకాష్ నగర్, తవాక్కల్ నగర్, అలీ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తొమ్మిదేళ్ల పాలనలో నిరుద్యోగుల గురించి పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు,‘ అని తీవ్రం గా విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధిని అజెండాగా చేసుకొని ముందుకు సాగుతున్న తమ ప్రజా ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఓటర్లు అండగా నిలవాలని, నవీన్ యాదవ్ను మెజార్టీతో గెలిపించాలని కోరారు.