calender_icon.png 24 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధిస్తున్న యూరియా కొరత

24-09-2025 12:47:23 AM

  1. రైతులకు తప్పని తిప్పలు

అర్ధరాత్రి నుంచే రైతు వేదికల వద్ద క్యూ

నిలబడలేక క్యూలో చెప్పులు

నల్లగొండ జిల్లా పెద్దవూరలో రైతులపై హోంగార్డు దాడి

నకిరేకల్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉంది. డిమాండ్‌కు తగిన యూరియా సకాలంలో రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలో రైతు వేదికల వద్ద అర్ధరాత్రి నుంచే రైతులు క్యూ కట్టారు.

నిలబడలేని స్థితిలో ఉన్న రైతులు చెప్పులు క్యూలో పెట్టారు. రైతు వేదిక తీసే సమయంలో రైతుల ఒకసారి గా నెట్టి వెసుకున్నారు. దీంతో పోలీస్ సిబ్బంది వచ్చి రైతులకు సర్ది చెప్పి. యధావిధిగా లైన్లు కొనసాగించారు. 

రైతులపై చేయి చేసుకున్న హోంగార్డు

నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద మంగళవారం హోంగార్డు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్నాడు. పెద్దవూర పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న.

ఉష్యా నాయక్ యూరియా కోసం క్యూలో బారులు తీరిన రైతులను లైన్‌లో నిలబెట్టే క్రమంలో ఐదుగురు రైతులపై చేయి చేసుకున్నాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. తమపై చేయి చేసుకున్న హోంగార్డు ఊష్యా నాయక్‌ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 

వరుసలో తువాలలు

సూర్యాపేట(విజయక్రాంతి): యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటివరకు ఆధార్ కార్డు, భూమి పాస్బుక్ జిరాక్స్‌లు, చెప్పులు వరుస క్రమంను చూశాం. కానీ సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో రైతులు మరో విధానాన్ని అనుసరిస్తున్నారు.

మేళ్లచెరువు సహకార సంఘం ఎదుట మంగళవారం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కట్టారు. ఎక్కువసేపు లైన్‌లో నిలబడలేక తమ తువాళ్లను క్యూ లైన్ కోసం అమర్చిన ఐరన్ రాడ్లకు వరుసగా కట్టారు. 

నిర్మల్ జిల్లాలో

నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. ఖానాపూర్ మండల కేంద్రంలో 150 మంది రైతులకు ఎరువు లభించకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. సారంగపూర్ మండలం కౌట్లలో ఎరువులు లభించకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.