23-07-2025 08:01:11 PM
రిజియన్ ఇంచార్జీ కాజీపేట కృష్ణ..
మణుగూరు (విజయక్రాంతి): పద్మ శ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి మాదిగ ఎంప్లాయిస్ యూనియన్ రిజియన్ ఇంచార్జీ కాజీపేట కృష్ణ కోరారు. ఈ నెల 25న గోదావరిఖనిలో మాదిగ ఎంప్లాయిస్ అసోషియేషన్(Madiga Employees Association) ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. రెండు దశాబ్దాల క్రితమే మందకృష్ణ మాదిగ సింగరేణిలో పర్యటించి మాదిగ ఎంప్లాయిస్ ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి అధ్యాయనం చేశారన్నారు. ఆయన ఆదేశానుసారమే అసోసియేషన్ స్థాపించడం జరిగిందని తెలిపారు.
మాదిగ ఉద్యోగులకు సింగరేణిలో కొండంత అండగా నిలిచి నేనున్నానంటూ బెల్లంపల్లి నుండి కొత్తగూడెం వరకు భరోసా యాత్రను సాగించిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా భారీ సన్మాన సభ ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు ఆర్కే గార్డెన్స్ లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చొప్పదండి దుర్గప్రసాద్, అధ్యక్షులు బొంకూరి మోహన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ భారీ సన్మాన బహిరంగసభకు మాదిగ అనుబంధ సంఘాల నాయకులు, ఎంప్లాయిస్, పదవి విరమణ పొందిన కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.