10-02-2025 12:00:00 AM
పటాన్చెరు, ఫిబ్రవరి 9 : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక సాంకేతిక, సాంస్కృతికోత్సవాలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఈడీఎం - డీజే నైట్తో పాటు పలు కార్యక్రమాలలో విద్యార్థులు తమ ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలలో విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు. పలు సెమినార్లు, ఆటో ఎక్స్ పో.బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ తో పాటు వివిధ పోటీలు, ర్యాంప్ వాక్, నృత్యాలు, పాటల పోటీలు జరిగాయి.
చివరి రోజు ప్రపంచ ప్రసిద్ధ జూలియా బ్లిస్, పీఆర్ వో బ్రదర్స్ యొక్క అద్భుతమైన ఈడీఎం- డీజే నైట్ ప్రదర్శనతో ప్రమాణ-2025 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి గమనాన్ని కొత్త కోణంలోకి తీసుకెళ్లింది.
ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలు, ఇతరత్రా కార్యక్రమాలలో జంట నగరాలలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. హైదరాబాద్ గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు పర్యవేక్షణలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆధ్యాపక సలహాదారు ప్రొఫెసర్ పి త్రినాథరావు, డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ప్రతినిధి రాహుల్ మండల్, పలువురు అధ్యాపకులు, ప్రమాణ కోర్ కమిటీ సభ్యులు వేడుకలను పర్యవేక్షించారు.