26-01-2026 12:56:58 AM
నిజామాబాద్, జనవరి 25 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉదయం 9.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
రిపబ్లిక్ డే వేడుకకు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇటీవలే అధికారులతో నిర్వహించిన సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు.
వేదిక, ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్ల గురించి సంబంధిత శాఖల అధికారులతో ఐ.డీ.ఓ.సీలో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు పోలీస్ పరేడ్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.