11-07-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చిట్యాల, జూలై 10 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, పేద ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్యుల కొరత వల్ల రోగులకు సరైన వైద్యం అందడం లేదన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దవాఖానలో మెరుగైన వైద్యాన్ని అందించేదని, వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రసవాల కోసం ప్రత్యేక గైనకాలజిస్ట్ డాక్టర్లను సైతం నియమించామని పేర్కొన్నారు.
ప్రస్తుతం చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరగడంలేదని, రోగులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఆసుపత్రులపై నిర్లక్ష్య ధోరణి చూపెడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఆస్పత్రులపై రివ్యూలు నిర్వహించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్, నాయకులు పిట్ట సురేష్ బాబు, కర్రే అశోక్ రెడ్డి, పాండ్రాల వీరస్వామి, ఏరుకొండ రాజేందర్, కాట్రేవుల కుమార్, పిట్టల రాజమౌళి, చిలుముల రమణాచారి, దామెర రాజు, చాడ ఆనందారెడ్డి, బైరం భద్రయ్య పాల్గొన్నారు.