13-12-2025 01:02:18 AM
చేవెళ్ల, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. చేవెళ్ల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఎన్నికల ఉత్సాహం క్రమంగా టెన్షన్గా మారుతోంది. ప్రచార డప్పులు మోగడం ఆగిపోవడంతో, ఇప్పుడు అభ్యర్థులు, కార్యకర్తలు పోలింగ్ రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 14న రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది.
రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. రెండో విడతలో రంగారెడ్డి జిల్లా లో 247 పంచాయతీ లకు, 2134 వార్డు లకు ఎన్ని కలు జరగనున్నాయి. చేవెళ్ల డివిజన్ లో 178 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 1540 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రారంభమై, అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు.
కోడ్ ఉన్నా లెక్కలేదు..
పల్లెపోరును పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రవర్తనా నియమావళిని అమలు చేయడంతో పాటు మద్యం, నగదు పంపిణీని అడ్డుకునేందుకు ఎఫ్ఎస్, ఎస్ఎస్ఈ బృందాలను నియమించింది. వీటికి తోడు తనిఖీ కేంద్రాలను ప్రారంభించినా ప్రయోజనం లేకుండా పోయింది. పల్లెల్లో మద్యం, నగదు పంపిణీ జరిగనుంది. పంచాయతీల్లో ఇప్పటికే అభ్యర్థులు ఇంటింటికి నగదు పంపిణీ ప్రారంభించారని సమాచారం. ఓటు ధర రూ.8వేల నుంచి రూ.10 వేలు పలుకుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు..!
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను డివిజన్ అధికారులు పూర్తిచేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించడంతో పాటు పోలింగ్ను వీడియో చిత్రీకరణ చేయాలని నిర్ణయించారు. కేంద్రాల సమీపంలో అభ్యర్థులు ప్రచారం నిర్వహించకుండా ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ సందర్భంగా ఏమైనా సమస్యలు ఉత్పన్నమయితే రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.
రెండో విడత వివరాలు..
మండలం జీపీలు వార్డులు
శంకర్పల్లి 24 210
మొయినాబాద్ 19 166
చేవెళ్ల 25 218
షాబాద్ 41 325
ఆమనగల్లు 13 112
కడ్తాల్ 24 210
తలకొండపల్లి 32 272
మొత్తం 247 2134