17-05-2025 07:58:07 PM
టిపిసిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇంచార్జ్ తిప్పారపు సంపత్..
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని గొల్ల గూడానికి చెందిన దళిత యువకుడు మహేందర్ ను అకారణంగా చితకబాదిన సైదాపూర్ ట్రైనీ ఎస్సై భార్గవ్(Trainee SI Bhargav) ను సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టిపిసిసి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ ఇంచార్జ్ తిప్పారపు సంపత్ డిమాండ్ చేశారు. శనివారం గొల్లగూడెంలో మహేందర్ ను పరామర్శించి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పాయింట్ వద్ద ఫోన్ మాట్లాడుతున్నందుకే మహేందర్పై భార్గవ్ చెంపదెబ్బ కొట్టగా, కానిస్టేబుల్ ఆకాష్ రెడ్డి లాఠీతో వెన్నుపై కొట్టినట్టు తెలిపారు.
దాడిలో మహేందర్కు చెవులలో గాయమై రక్తస్రావం జరిగిందని తెలిపారు. ఆర్థిక సమస్యలతో కుటుంబం చికిత్స నిలిపివేసినట్టు సంపత్ వెల్లడించారు. భార్గవ్ కులదూషణలు చేస్తూ అవమానపరిచాడని, మహేందర్ ది తప్పు అని ఎస్ఐ భార్గవ్ లేఖ రాయించుకున్నాడని సంపత్ ఆరోపించారు. జిల్లా పోలీస్ అధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.