25-07-2025 12:15:23 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ ఆర్అండ్బీ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాగులు, వంకలు పొంగుతున్నం దున వంతెనల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న చోట్ల ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక యంత్రాంగం ద్వారా పరిశీలించాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలో ఉండే ఎస్ఈలు.. ఈఈ, డీఈఈ, ఏఈలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రతి నాలుగైదు గంటలకు ఓసారి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తూ హైదరాబాద్కు సమాచారం అందించాలన్నారు. కోతకు గురైన రోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.
రోడ్లను ఆనుకొని ఉన్న హైటెన్షన్ వైర్లు తెగిపడి ప్రమాదాలకు అవకాశం ఉంటుందని.. ఇలాంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా వర్షాల వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలగొద్దన్నారు. అత్యవసరమైతే తప్ప ఆర్అండ్బీ సిబ్బంది సెలవులో వెళ్లొద్దని ఆదేశించారు.