19-09-2025 12:00:00 AM
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
నకిరేకల్, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): భూమి, భుక్తి, విముక్తి కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమే అని దీనిని మత ఘర్షణగా సృష్టించే బిజెపి విధానాన్ని ఎండగట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.
గురువారం సిపిఎం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల జిల్లా వ్యాప్త యాత్ర సందర్భంగా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో జరిగిన ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ తెలంగాణ విమోచన పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ హిందూ ముస్లింల గొడవగా సృష్టిస్తూ తప్పుదారి పట్టిస్తూ చరిత్రను వక్రీకరిస్తుందని విమర్శించారు.
దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, స్వరాజ్యం, షాయబుళ్లాఖాన్, బందగీ వంటి యోధులంతా కమ్యూనిస్టులే అని అన్నారు. వారి జీవిత చరిత్రలే తెలంగాణా పోరాటానికి నెత్తుతి సాక్ష్యాలని అన్నారు. సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే బీజేపీ ని చరిత్ర క్షమించదని అన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్ మాట్లాడుతూ.. వీరోచిత తెలంగాణా సాయుధ పోరాట స్ఫూర్తితో పాలకులు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఉద్యమించాలని అన్నారు.
సభ అనంతరం ప్రజానాట్యమండలి కళాకారుల ఆట-పాట ప్రజలను ఆకట్టుకున్నాయి. రాళ్లపల్లి జితేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశం పాల్గొన్నారు.