30-12-2025 12:11:05 AM
నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ డిమాండ్
ముషీరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశా ల్లో ప్రతిపక్షాలు చొరవ తీసుకొని అసెంబ్లీలో నిరుద్యోగ అంశం చర్చకు వచ్చేలా చూడాలని ప్రతిపక్షాలకు నిరుద్యోగ హక్కుల వేదిక విజ్ఞప్తి చేసింది. కృష్ణా, గోదావరి జలాలు ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది నిరుద్యోగుల సమస్యలు కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక అధ్యక్షులు అశోక్ నిరుద్యోగులతో కలసి మాట్లాడారు.
మేనిఫెస్టోలో తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పూర్తయి ఫలితాలు ఇచ్చిన తరువాత నియామక పత్రాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప నిరుద్యోగులకు చేసింది శూన్యమని అన్నారు. నిరుద్యోగుల విషయాన్ని ప్రతిపక్షం సీరియస్ గా తీసుకొని జాబ్ క్యాలెండర్, నిరోద్యగ భృతి, నిరుద్యోగులకు ప్రత్యేక కార్డులు వంటి ఎన్నో హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. లేని పక్షంలో సంక్రాంతి తరువాత ముఖ్యమంత్రికి చావు డప్పు మోగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు కొడంగల్ రవి, ఇంద్రా నాయక్, కయ్యా వెంకటేష్, శంకర్ నాయక్, సింధూ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.