31-01-2026 12:37:46 AM
నిజామాబాద్, జనవరి 30(విజయక్రాంతి) : ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల భద్రత, సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, హాస్టళ్ల ప్రాంతీయ సమన్వయకర్తలు (ఆర్.సీ.ఓ)లు, నిర్వాహకులతో కలెక్టర్ సమీక్ష జరిపారు.
ఇటీవల కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలను ఉటంకిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా ఉదంతాలు చోటుచేసుకోకుండా పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి బాలికల వసతి గృహాలు, గురుకులాల నిర్వహణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, ఆర్.సీ.ఓలు, హాస్టళ్ల నిర్వాహకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.