16-08-2025 12:18:01 AM
మూసారాంబాగ్ వంతెన వద్ద వ్యర్థాల తొలగింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): హిమాయత్సాగర్ నుంచి విడుదలైన భారీ వరద నీటితో ఉప్పొంగిన మూసీ నది ప్రవాహానికి మూసారాంబాగ్ వంతెన వద్ద పేరుకుపోయిన చెత్త, గుర్రపు డెక్క ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. దీంతో చాదర్ఘాట్, మూసారాంబాగ్లోని శంకర్నగర్, మూసానగర్, రసూల్పుర వంటి లోతట్టు బస్తీల్లోకి వరద నీరు పోటెత్తే ప్రమాదం ఏర్పడింది.
స్పందించిన హైడ్రా బృందాలు రంగంలోకి దిగి మూసారాంబాగ్ వంతెన పిల్లర్ల వద్ద పేరుకుపోయిన టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు, గడ్డి, గుర్రపు డెక్కను శుక్రవారం తొలగించారు. హైడ్రా ఎస్ఎఫ్ఓ శ్రీనివాస్ నేతృత్వంలో డీఆర్ఎఫ్, మెట్ బృందాలు, జీహెఎంసీ సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. దీంతో గంటల వ్యవధిలోనే మూసీ ప్రవాహానికి అడ్డంకులు తొలగి, వరద నీరు సాఫీగా ముందుకు సాగింది. లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు తాత్కాలికంగా తప్పింది.