26-09-2025 12:00:00 AM
ఖైరతాబాద్, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి) : తెలంగాణ సినిమా లో పక్క రాష్ట్రం నుండి వచ్చిన వారి ఆధిపత్యం పెరిగిపోయిందని, సినిమా రంగంలో తెలంగాణ, ఆంధ్ర విభజన జరగాలని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర కమిటీ ప్రభుత్వనికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక గౌరవ అధ్యక్షుడు ప్రఫుల్ రాంరెడ్డి,అధ్యక్షుడు లారా, కార్యదర్శి మోహన్ బైరాగి తో కలిసి తెలంగాణ క్రాంతి దళ్ నేతలు పృథ్వి రాజ్, విఠల్ లు మాట్లాడారు.
నకిలీ సభ్యుల సభ్యత్వం తొలగించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కోరా రు. తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ లో దాదాపు పదేళ్ల నుండి ముగ్గురి ఆధిపత్యం వల్ల మిగతా తెలంగాణ ఆర్టిస్ట్ లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆ ముగ్గురు బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతు కోట్ల రూపాయలు అవినీతి చేశారని ఆరోపించారు.
ఆర్టిస్ట్లు కానివారికి వందల్లో నకిలీ సభ్యత్వాలు ఇచ్చారని, ఆ నకిలీ సభ్యత్వాల వ్యవహారం తేల్చే వరకు ఈ నెల 28 న నిర్వహించాలనుకుంటున్న ఎన్నికలను ఆపేయాలని, లేదంటే తీవ్ర నిరసన ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ఆర్టిస్ట్ ల మీద ఇకనుండి ఆంధ్రా పెత్తనం ఉండదని, వారి తాటాకు చప్పుల్లాకు భయపడేది లేదన్నారు.
అందరిని సంఘటితం చేస్తూ ఇక నుం చి పోరాటం చేస్తామన్నారు. 28న ఎన్నికలు ఎలా జరుపుతారో చూస్తామని హెచ్చరించారు.ఆంధ్ర పెత్తందార్లను ఆనాటి ఉద్యమం లోనే తరిమేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కస్తూరి శ్రీనివాస్, తుల్జా రెడ్డి, గోవిందరాజు, భద్ర, నర్సింగ్, రాకేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.