03-07-2025 01:10:40 AM
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు కథ ముగియలేదు. తెలంగాణకు అభ్యంతరకరంగా ఉన్న బనకచర్ల ప్రాజెక్టు సమస్య నిజానికి ఇప్పుడే మొదలైంది. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ సందేహాలు వ్యక్తపరుస్తూ ప్రస్తుత దశలో అనుమతులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. దీనితో తెలంగాణ కేరింతలు కొట్టి మిన్నకుంటే సరిపోదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎక్కడో లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరపడమే తక్షణా వసరం.
గోదావరి, కృష్ణా నదీ జలాల పంపకం, మిగుల జలాల వినియోగంపై శాశ్వతంగా ఒక అవగాహనకు రావడం తప్పనిసరి. రెండు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు, అధికారులు కూడా ఈ చర్చల్లో పాల్గొనాలి. ఒక్కరోజు కాకపోతే రెండు, మూడు రోజులైనా రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలకు సంబంధించి ఫలప్రదమయ్యే విధం గా చర్చలు జరపడమే ఉభయ రాష్ట్రాలకు మంచిది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆధారపడి ఉంది. కేంద్రం లోని పెద్దలతో ఆయనకు సాన్నిహిత్యమూ ఉంది. కనుక, బనకచర్ల ప్రాజె క్టును ఆంధ్రప్రదేశ్ ఎలాగైనా సాధించుకునేందుకు మెండుగా అవకాశాలు ఉన్నాయి. సంప్రదింపుల ద్వారా ఉభయ రాష్ట్రాల మధ్య ఈ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకు డుగానే వెళ్లాల్సివుంటుంది.
కేంద్రానికి విజ్ఞాపనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. అఖిలపక్ష బృందం తో ఢిల్లీ వెళ్లి, అవసరమైతే అక్కడ ధర్నా చేయాలి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణకు జరిగే నష్టంపై నినదించాలి. రాష్ట్రంలో జిల్లా కేంద్రాలు మొదలుకొని క్షేత్రస్థాయిలో గ్రామాల వరకు ఆందోళనలు చేపట్టాలి. మాకు న్యాయం చేయాలని బీజేపీపై పెద్దఎత్తున ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది.
కేంద్ర పర్యావరణ నిపుణుల కమి టీ కాదుకూడదు అన్నది కదా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై ఆశలు వదులుకోదు. ఇప్పుడు ఏం చేయాలో ఏపీ ప్రభు త్వం అదే చేస్తున్నది. ప్రాజెక్టు విషయంలో వ్యక్తమైన అభ్యంతరాలను తోసిపుచ్చేందుకు తగిన నివేదికను రూపొందిస్తున్నది.
ప్రాజెక్టు కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తున్నది. బ్యాంకుల నుంచి నిధులు సమ కూర్చుకుంటున్నది. ప్రాజెక్టు కాంట్రా క్టు దక్కనున్న ఓ బడా నిర్మాణ కంపె నీ, ఆ ప్రాజెక్టు సాకారానికి అవసరమైన అండదండలు ఏపీ ప్రభుత్వానికి అందిస్తున్నట్టు తెలుస్తున్నది.
నదీ జలాల వాటాలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి. అందుకు తెలంగాణ ప్రభుత్వం తగిన వ్యూహా న్ని తక్షణం తయారుచేసుకోవాలి. ఒక పథకం ప్రకారం ముందుకెళ్లాలి. దశాబ్దాలుగా కోర్టులు, ట్రిబ్యునల్స్ చుట్టూ తిరుగుతున్న నీటి వాటా వివాదాలు శాశ్వతంగా పరిష్కారం కావాలి. తెలంగాణకు న్యాయబద్ధ మై న నీటివాటా దక్కాలి. అందుకు తెలంగాణ పాలక, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విలేకరుల సమావేశాల్లో దుమ్మెత్తిపోసుకోవడంతో సరిపెట్టుకో కుండా, ఇకపై రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా కలిసి ముందుకెళ్లాలి.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి