27-12-2025 01:49:48 AM
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన తాజాచిత్రం ‘ధురంధర్’. ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలై, బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. రిలీజైన 21 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లోకి చేరింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ నిలిచింది. 1000 కోట్ల క్లబ్లో చేరిన 9వ భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. 2017లో విడుదలైన రాజమౌళి ‘బాహుబలి2’ 1000 కోట్ల క్లబ్లోకి చేరిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.1788.06 కోట్లను సాధించింది. 2016 మే నెలలో ‘దంగల్’ విడుదలై, ‘బాహుబలి2’ను అధిగమించి రూ.2070 కోట్లు సాధించిన ఏకైక చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ‘దంగల్’ మైలురాయిని దాటిన తదుపరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇది 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1,230 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఒక నెల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్2’ కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.1215 కోట్ల వసూళ్లు సాధించింది. అట్లీ ‘జవాన్’తోపాటు సిద్ధార్థ్ ఆనంద్ ‘పఠాన్’ కూడా 2023లో 1000 కోట్ల క్లబ్లో చేరాయి.
‘జవాన్’ 1160 కోట్లు, ‘పఠాన్’ 1055 కోట్లు వసూలు చేశాయి. 2024లో విడుదలైన నాగ్అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ కూడా ప్రపంచవ్యాప్తంగా 1042.25 కోట్ల వసూళ్లతో ఆ మైలురాయిని దాటింది. ఇప్పుడు ఈ 2025 సంవత్సరాంతంలో ‘ధురంధర్’ వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. 21 రోజుల్లో 1006.7 కోట్లు వసూళ్లు చేసిందీ సినిమా. మున్ముందు ఇంకెన్ని వసూళ్లు సాధిస్తుందోననే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.