27-09-2025 12:31:28 AM
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్పై సంబురాలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు నగరంలో అంబరాన్నంటనున్నాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్పై బతుకమ్మ కార్నివాల్ను నిర్వహించనున్నారు. రాష్ర్ట పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభు త్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నగరవాసులు, సందర్శకులు ఈ సాంస్కృతిక సంబరంలో మమేకమయ్యేందుకు వీలు గా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఈ కార్నివాల్ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టనుంది. సందర్శకులను ఆకట్టుకునేందుకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నోరూరించే అచ్చ తెలంగాణ పిండివంటకాలతో ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేయ నున్నారు. జానపద సంగీతం, సంప్రదాయ నృత్యాలతో కళాకారులు అలరించనున్నా రు.
గాజుల తయారీ, మెహందీ ఆర్ట్, బతుకమ్మల తయారీ వంటి కార్యక్రమాలతో పాటు, స్థానిక హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు ఉంటాయి. ట్యాంక్ బండ్ పరిసరాల్లో మహిళలు బతుకమ్మలతో నిర్వహించే ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సందర్శకులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయనున్నారు.