09-05-2025 10:58:54 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): శనివారం నుండి అధికారులు కాళేశ్వరంలో మకాం వేసి, అన్ని ఏర్పాట్లను సమీక్షించి పుష్కర పనులను పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ... భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆరోగ్య శిభిరాల ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన స్టేజి, మైక్ ఇతర ఏర్పాట్లు, పారిశుద్ధ్య చర్యలు, సిబ్బందికి ఆహార ఏర్పాట్లపై పర్యవేక్షణకు విధులు కేటాయించిన అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. వైద్య సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వైద్య సేవలు నిర్వహణపై వైద్యులు సిబ్బంది మూడు షిప్టు లలో విధులు నిర్వహించాలని ఆదేశించారు. అత్యవసర మందులు, ఓఆర్ఎస్ పాకెట్స్ అందుబాటులో ఉండాలని తెలిపారు.
అత్యవసర సేవలకు మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 30 బెడ్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అంబులెన్స్, 108 సేవలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనంతరం వివిఐపి ఘాట్ గోదావరిలో నీటిమట్టం, టెంట్ సిటిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. టెంట్ సిటీ వద్ద వర్షం వచ్చినా బురద కాకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రావెల్ వేయాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, వైద్య ఆరోగ్య శాకాధికారి డా మధుసూదన్, డిపిఓ వీర భద్రయ్య, ఆర్ అండ్ బి, పీఆర్ ఇంజినీరింగ్, దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.