16 June, 2026 | 2:46 AM

పారదర్శకంగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

16-06-2026 01:55 AM

మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో 46 మందికి అందజేత

ఖమ్మం, జూన్ 15(విజయక్రాంతి): ‘అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, వంద శాతం పారదర్శకంగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

సోమవారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 46 మంది లబ్ధిదారులకు రూ.16,64,500 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ... అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ నిధులు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు రూపాయి కూడా పక్కదారి పట్టకుండా, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేస్తూ నేరుగా లబ్ధిదారుల చేతులకే ఈ ఆర్థిక సాయం అందేలా చూస్తున్నామని వివరించారు. కార్పొరేట్ వైద్య భారాన్ని మోయలేక సతమతమవుతున్న పేద కుటుంబాలకు ఈ సీఎంఆర్‌ఎఫ్ సహాయం ఎంతో భరోసానిస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే వేదికగా ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.