08-08-2025 12:21:00 AM
ఇల్లెందు, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని మీసేవ కేంద్రాలలో ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను పరిశీలించేందుకు గురువారం అదనపు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో జిల్లా ఈ డిస్టిక్ మేనేజర్ సైదేశ్వర రావు , తెలంగాణ గ్రీవెన్స్ అండ్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ జిల్లా మేనేజర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రాథమికంగా మి-సేవ కేంద్రాలలో నిర్వహణ, శుభ్రత, సాంకేతిక వసతులు, సిబ్బంది ప్రవర్తన, సేవల వేగం వంటి అంశాలను తనిఖీ చేసారు.
కేంద్రానికి వచ్చిన ప్రజలు చేస్తున్న దరఖాస్తులు ముఖ్యంగా ఆదాయ ధ్రువపత్రాలు, మౌలిక వృత్తి ధ్రువపత్రాలు, రేషన్ కార్డులు, జనన, మరణ ధ్రువపత్రాలు, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు వాటి స్థితిని వివరంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకు ఆ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అని అడిగి తెలుసుకుని, తక్షణమే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మి-సేవ ఆపరేటర్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రామాణిక ధరల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక రుసుములు వసూలు చేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రజలను మోసగించకుండా పారదర్శకతతో పనిచేయాలనీ, ప్రతి వినియోగదారుని పట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు.
అదనపు కలెక్టర్ పర్యటనలో భాగంగా కేంద్రాలలో వున్న సూచిక బోర్డులు, సేవల జాబితా, సేవలకు సంబంధించి రుసుముల వివరాలు స్పష్టంగా ప్రదర్శించబడుతున్నాయా లేదానేది కూడా తనిఖీ చేశారు. ప్రజలకు సేవలపై అవగాహన కల్పించే విధంగా వివిధ సేవలకు సంబంధించిన రుసుముల వివరాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండటం మాత్రమే కాదు, ప్రజలకు అవి వేగవంతంగా, పారదర్శకంగా, నాణ్యంగా అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనిలో భాగంగా మి-సేవ కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తాం అన్నారు. ప్రజల ఫిర్యాదులను జాగ్రత్తగా పరిశీలించి, వేగంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలి అని తెలిపారు.