calender_icon.png 19 August, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతం ముసుగులో.. బీసీ బిల్లులకు బీజేపీ మోకాలడ్డు

19-08-2025 12:14:16 AM

  1. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారు..
  2. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లను తొలగించగలరా?
  3. ఐదు నెలల నుంచి కేంద్రం వద్ద బీసీ బిల్లుల పెండింగ్
  4. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో ధర్నా చేపట్టాం..
  5. మా పోరాటానికి బీఆర్‌ఎస్, బీజేపీ మద్దతు ఇవ్వలేదు..
  6. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం
  7. రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న జయంతి సభ
  8. ట్యాంక్‌బండ్ వద్ద పాపన్న విగ్రహ నిర్మాణానికి భూమిపూజ

హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 18 (విజయక్రాంతి): ‘మతం ముసుగులో బీజేపీ బీ సీ కోటా బిల్లులకు మోకాలడ్డుతున్నది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేదు. కావాలనే బీజేపీ నేతలు అబద్ధాలు చెప్తున్నారు? బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఎందుకు ముస్లిం రిజర్వేషన్లు తొలగించలేదు?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలదీశశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన హైదరాబాద్‌లోని ట్యా ంక్‌బండ్ వద్ద పాపన్న విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు.

అనంతరం రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిం చిన సర్వాయి పాపన్న జయంతి సభలో సీ ఎం ప్రసంగించారు. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి రం గాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో రెండు బిల్లులు చేసి కేంద్రానికి పంపించిందని, వాటికి రాష్ట్రపతి ఆమోదం తెలప కుండా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం ఆరో పించారు.

ఐదు నెలలుగా రెండు బీసీ కోటా బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటి ఆమోదం కోసం ఒత్తిడి తెచ్చేం దుకే తనతో పాటు క్యాబినెట్ మం త్రులు, ఎంపీలు, ఎంతోమంది  ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లి ధర్నా చేశామని గుర్తుచేశారు. న్యాయబద్ధమైన బీసీ కోటా కోసం తాము ఉద్యమిస్తుంటే, బీజేపీ, బీఆర్‌ఎస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని నిలదీశారు. మతం ముసుగులో బీజేపీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు.

దేశవ్యా ప్తంగా భారీ ఎత్తున ఓట్ల దొంగతనం జరుగుతున్నదని, ఈ కుట్రను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టారని గుర్తుచేశారు. మహారాష్ర్టలో నాలు గు నెలల్లో కోటి దొంగ ఓట్లు నమోదు చేశారని తెలిపారు. బీహార్‌లో ఈసీ అక్రమంగా 65 లక్షల ఓట్లు తొలగించిందని ఆరోపించా రు.

తప్పు చేసిన వారిని వదిలేసి, ప్రశ్నించిన రాహుల్ గాంధీకే ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఓట్ల దొంగతనంపై గొంతెత్తేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తు న్నారని, ఆ యాత్రలో తనతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క స్వయంగా వెళ్లి, రాహుల్‌గాంధీతో యాత్రలో నడిచి మద్దతు ప్రకటిస్తామని తెలిపారు.

బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక పాపన్న

బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని సీఎం కొనియాడారు. పాపన్న స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని నిర్మిస్తుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన ప్రక్రియ ద్వారా.. రాష్ట్రంలో బీసీలు 56. 33 శాతం ఉన్నారని తేలిందని, వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 95 వేల మంది ఎన్యుమరేటర్లతో, 60 రోజుల పాటు పకడ్బందీగా ఇంటింటి సర్వే చేపట్టామని తెలిపారు.

సేకరించిన సమాచారం ఆధారంగానే బీసీ జనాభాను 56.33 శాతంగా తేల్చా మని స్పష్టంచేశారు. మహామహుల విగ్రహా లు నిర్మించడం, వాటిని ఆవిష్కరించడం, వారి జయంతులు, వర్ధంతుల నిర్వహించేందుకు కాదని, వారి స్ఫూర్తిని నేటి తరంలో రగిలించడం కోసమేనని వెల్లడించారు. అందుకే పాపన్న విగ్రహాన్ని సచివాలయం సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం పాపన్న చరిత్రను కాలగర్భంలో కలపాలని చూసిందని ఆరోపించారు.

తమ ప్రభుత్వం పాపన్న విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కులగణనను వక్రీకరించేందుకు కొందరు తొండి వాదనలు చేస్తున్నారని, వారి వాదనలతో మరో వందేళ్లునా బీసీలకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు పోవాలే తప్ప, సమస్యలను జటిలం చేసుకుంటూ పోతే పరిష్కారం ఉండదని తేల్చిచెప్పారు.

బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలంటే, ఆయా వర్గాలకు చెందిన పిల్లలు విద్యావంతులు అవ్వాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అదే నినాదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మించబోతున్నదని వెల్లడించారు.

కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివి క్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభా కర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మే యర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.