19-08-2025 12:40:44 AM
*భట్టి విక్రమార్క
ఖమ్మం, ఆగస్ట్ 18 (విజయ క్రాంతి): మధిర పట్టణ అభివృద్ధి పనులపై మున్సిపల్ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వ్వహించారు.మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధిర పట్టణ సమగ్ర అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
నెలకు ఒకసారి మున్సిపల్ ఇంజనీర్ ఇన్ చీఫ్, ప్రతి 15 రోజులకు సీఈ స్థాయి అధికారులు విధిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. నాణ్యతతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల ప్రగతికి సంబంధించి ప్రతి వారం, 15 రోజులు, నెల రోజులు వ్యవధిలో టార్గెట్ లు నిర్దేశించుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిర్మాణానికి సంబంధించి మధిర పట్టణ ప్రజలకు సవివరంగా తెలియజేయాలని, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతిష్టాత్మమైన ఈ ప్రాజెక్టు పనులపై నేను తరచూ సమీక్ష చేస్తానని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు.
అమృత్ స్కీం కింద జరుగుతున్న అభివృద్ధి పనులు, జాలి మూడు నుంచి మధిర పట్టణానికి తాగునీటి సరఫరా పనులకు సంబంధించిన అంశాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నప్పటికీ స్వల్ప అంతరాయాలు లేకుండా భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాలిమూడి నుంచి మధిర పట్టణ ప్రజలకు తాగునీరు అందించే ప్రణాళికలు రూపొందించినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. వైకుంఠధామం లో జరుగుతున్న పనులను డిప్యూటీ సీఎం సమీక్షించారు.
వైకుంఠధామం భూములను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పనులపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ వైకుంఠ దామం తరహాలో మధిర వైకుంఠధామం నిర్మాణం జరగాలని ఆదేశించారు.నెల రోజులు అంబేద్కర్ స్టేడియం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మధిర పట్టణంలో చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డ్ కు తరలించాలి తప్ప రహదారుల వెంట చెత్త కనిపించడానికి వీల్లేదని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీదేవి, పబ్లిక్ హెల్త్ ఇ ఎన్ సి భాస్కర్ రెడ్డి, మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.