22-08-2025 12:55:39 AM
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు
నాగర్ కర్నూల్ ఆగస్టు 21 ( విజయక్రాంతి ) యూరియా బస్తా కొనాలంటే దాంతోపాటు ఇతర ఎరువులు కొనాల్సిందేనని ఎరువుల దుకాణదారులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో ఆయా ఎరువుల దుకాణదారుల వద్ద గురువారం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న సంకల్ప ఎరువుల దుకాణంలో రైతులకు బలవంతంగా యూరియాతోపాటు ఇతర నాసిరకమైన ఎరువులు పెస్టిసైడ్ మందులను అంటగడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
పాత వ్యవసాయ మార్కెట్ కేంద్రాల్లోని కొన్ని దుకాణాల్లోనూ యూరియా బస్తా అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు రైతులు ఆరోపించారు. 267 ధర ఉన్న యూరియా బస్తా 300 వసూలు చేస్తున్నారని,
డీఏపీ ఎరువుల బస్తా 1350 కాగా 1500కు పైగా రైతుల నుండి అక్రమంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి యూరియా లేదంటూ బయటికి గెంటేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయంపై వ్యవసాయ శాఖ అధికారులను వివరణ కోరగా ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సంకల్ప ఎరువుల దుకాణాన్ని 15 రోజుల పాటు లావాదేవీలు నిలిపివేస్తూ ప్రకటన జారీచేయడంవిశేషం.