28-09-2025 04:57:43 PM
అంగరంగ వైభవంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
తీరొక్క మొక్కులు చెల్లించుకుంటున్న భక్తజనం
పాపన్నపేట (విజయక్రాంతి): భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇంటి ఇలవేల్పుగా.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడవ రోజు ఆదివారం షష్ఠి పురస్కరించుకొని వనదుర్గామాతను మహా చండి (కాలరాత్రి)దేవి రూపంలో, నారింజ రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి నారింజ రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అమ్మవారికి బోనాల సమర్పణ
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన సోమవారం దుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, అర్చకులు పేర్కొన్నారు. ఈ బోనాల కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.
సరస్వతీ దేవిగా వనదుర్గమ్మ దర్శనం
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజైన సోమవారం వనదుర్గామాత సరస్వతీ దేవి రూపం, తెలుపు రంగు వస్త్రంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.