12-09-2025 01:14:00 AM
సూర్యాపేట, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి) : జిల్లాలోని గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాలకవీడు మండలం జాన్ పహాడ్ గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వ కళాకారుల పింఛన్ ఇప్పిస్తామని చెబుతూ ఒక్కొక్కరి వద్ద రూ.15_ 35 వేల వరకు వందల మంది నుండి వసూలు చేస్తుండడంతో పసిగట్టిన విజయక్రాంతి ’పింఛన్ వేషాలు’ పేరిట ఈనెల 5వ తేదీన ప్రధాన పత్రికలో కథనంను ప్రచురించింది.
అయితే ఈ కథనం వెలువడిన తదుపరి వీరి చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. కథనం వెలువడిన రెండో రోజే ఇదే విషయంపై గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో పదుల సంఖ్యలో బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో గురువారం పోలీస్ స్టేషన్ కు అదే మండలం లోని మంగాపురం గ్రామం నుండి 16 మంది బాధితులు,
కీతవారిగూడెం గ్రామం నుండి సుమారు 30 మంది బాధితులు వెళ్లి తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. అయితే సంబంధిత ఇద్దరు వ్యక్తులను స్టేషన్ కి పిలిపించి ఇదే విషయంపై పోలీసులు ఆరా తీసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా తమకు న్యాయం జరిగేలా అటు పోలీసులు, ఇటు ఉన్నతాధికారులు చూడాలని బాధితులు కోరుతున్నారు.