19-05-2024 01:14:12 AM
నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు
ప్రభుత్వానికి ఫిర్యాదుచేసిన కేయూ అధ్యాపకులు
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): వరంగల్ కాకతీయ యూని వర్శిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని వీసీ రమేష్పై ఆరోపణలు ఉన్నాయి. అన్యాయంగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం, అక్రమ బదిలీలకు పాల్పడడం, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు, ఫేక్ ప్రాజెక్టులకు అప్రూవల్ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.
ఈక్రమంలోనే కాకతీయ యూనివర్శిటీ అధ్యాపకుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులను విజిలెన్స్ డీజీకి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పంపించినట్లు శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. అంతేకాకుండా వీసీపై ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీహెచ్డీ అడ్మిషన్ల అంశంలో, వర్శిటీ భూమిని కబ్జా చేసిన ప్రైవేట్ వ్యక్తులకు వీసీ సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలోనే వీసీపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్కు ఆదేశాలు జారీ చేసింది.
విజిలెన్స్ విచారణను ఆహ్వానిస్తున్నాను: వీసీ
తనపై ప్రభుత్వం వేసిన విజిలెన్స్ విచారణను ఆహ్వానిస్తున్నట్లు కాకతీయ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకతీయ వీసీగా పనిచేసిన మూడేళ్లలో ఎక్కడ కూడా తాను నిబంధనలను ఉల్లం ఘించలేదన్నారు. యూనివర్శిటీ భూమి ఒక్క గుంట కూడా అన్యాక్రాంతం కాకుండా కాపా డానని ఆయన పేర్కొన్నారు. దొడ్డిదారిన ప్రమోషన్లు పొందాలని చూసే వ్యక్తులు, యూనివర్శిటీ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.