25-08-2025 07:36:16 PM
అర్మూర్ (విజయక్రాంతి): ఆర్మూర్ నియజకవర్గానికి చెందిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు విజయభారతి తన అనుచరులతో కలిసి బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), జిల్లా అధ్యక్షుడు, అర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశాన్నగారి జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన అనుచరులతో కలిసి బి.ఆర్.ఎస్. పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే 40 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.రూ. 15వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి మాటతప్ప లేదా? అని ఆయన మండిపడ్డారు. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందక రైతుకు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా పెన్షన్లు పెంచి రూ.4వేల చొప్పున ఇస్తామన్న హామీ ఏమైందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని బుట్ట దాఖలు చేశారని ఆయన విమర్శించారు. మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామన్న మహాలక్ష్మి పథకాన్ని తుంగలో తొక్కారన్నారు. విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారని ఆయన ప్రస్తావించారు. కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా? అని ఆయన ధ్వజమెత్తారు. డమ్మీ సీఎం రేవంత్ పై ప్రజలకు నమ్మకం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆయన విమర్శించారు. యథేచ్ఛగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల జోరు సాగుతోందని ఆయన ఆరోపించారు. ఎక్కడ చూసినా నిరంకుశత్వం, నిర్బంధాలు, అణచివేతలు, అక్రమ కేసులు, అరెస్టులే దర్శన మిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇదీ ఇందిరమ్మ రాజ్యం కాదు , హింసా రాజ్యమని దుయ్యబట్టారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన విధంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆ పార్టీలకు బైబై చెప్పి బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ చీకటి రోజులు పోయి కేసీఆర్ స్వర్ణ యుగం వస్తుందని జీవన్ రెడ్డి విస్పష్టంగా చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, తాటికొండ రాజయ్య, బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆయేషా ఫాతిమా షకీల్, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్ఎంబి రాజేశ్వర్, తుల ఉమ, రాజారామ్ యాదవ్, అరవింద్, ఆర్.కె పురంకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.