01-09-2025 01:12:27 AM
సున్నిత ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక నిఘా..
1600లకు పైగా వినాయక విగ్రహాల నిమజ్జనం
తాండూరు, 31 ఆగస్టు, (విజయక్రాంతి) : తాండూరు పట్టణం వాడవాడలో గత నాలుగు రోజుల నుండి పూజలు అందుకున్న గణనాథుడుని ఆదివారం భక్తిశ్రద్ధలతో భక్తులు గంగమ్మ ఒడికి చేర్చారు.. మధ్యాహ్నం గంజి మర్రిచెట్టు కూడలి నుండి ప్రారంభమైన వినాయక శోభాయాత్ర పురవీధుల గుండా యాలాల మండలం కోకట్ కాగ్న నదికి చేరింది.
దారి పొడవునా భక్తులు‘ గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు చోరియ; గణేష్ మహారాజ్ కి జై.. అంటూ నినాదాలు చేస్తూ భజన సంకీర్తనలు ఆలపిస్తూ కోలాటం ఆడుతూ మరియు భక్తి గేయాలకు లయబద్ధంగా డాన్సులు చేస్తూ ఉత్సాహంగా శుభ యాత్రలో పాల్గొన్నారు. మరోవైపు యువజన సంఘాల ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు, భజన మండలి సభ్యులు శోభాయాత్రను తిలకించేందుకు వచ్చిన భక్తులకు అల్పాహారం త్రాగునీరు అందించారు.
శ్రీ భద్రేశ్వర స్వామి దేవాలయం వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వాగత వేదిక వద్ద ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వినాయక విగ్రహాలపై పూలు జల్లి స్వాగతం పలికారు. వినాయక మండపాల అధ్యక్ష ,కార్యదర్శులకు సన్మానం చేసి జ్ఞాపికలను వారు అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డి.ఎస్.పి బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో 300 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పాత తాండూరు మరియు సున్నితమైన ప్రాంతాల లో ఎస్పీ నారాయణరెడ్డి పర్యవేక్షించారు. డిప్యూటీ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం తెల్లవారుజాము వరకు వినాయక నిమజ్జనం జరగవచ్చని రెవెన్యూ అధికారులు అంటున్నారు.