20-09-2025 05:18:56 PM
గద్వాల,(విజయక్రాంతి): 2002, 2025 ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి, సరిపోల్చే ప్రక్రియను సమర్ధవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ సమావేశం హాల్ నందు ఓటరు జాబితా సరి పోల్చే ప్రక్రియ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 2002, 2025 ఓటరు జాబితాల సరిపోల్చే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఓటరు జాబితా సరిపోల్చటంలో రెవిన్యూ గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని పరిశీలించాలని తెలిపారు.
ఓటర్ల జాబితా పరిశీలనను సక్రమంగా నిర్వహించేందుకు నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. ఓటర్ల వర్గీకరణ ప్రకారం,2002 జాబితాలో ఉన్నవారిని ఏ, లేని వారిని బి, 22–37 మధ్య వయస్సు ఉన్నవారిని సీ,18–21 మధ్య ఉన్నవారిని డి కేటగిరీలో నమోదు చేయాలని అన్నారు. ఎస్.ఐ.ఆర్ నిర్వహించడానికి ముందుగా,ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటరు జాబితాతో పోల్చి, కామన్గా ఉన్న పేర్లను మినహాయించి, 2002 తర్వాత కొత్తగా నమోదు అయిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా ధృవీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రోఫార్మా ప్రకారం రిపోర్టు తయారు చేయాలని అన్నారు.ఎస్.ఐ.ఆర్. కు సంబంధించి డెస్క్ వరకు సెప్టెంబర్ 23 నాటికి పూర్తి చేయాలని అన్నారు. ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించుకోని నిర్దేశిత గడుపులోగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అలివేలు, అన్ని మండలాల తహసిల్దార్లు, బి.ఎల్.ఓలు, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.