16-08-2024 02:18:18 AM
కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): రిజిస్ట్రేషన్ వాలిడిటీ ముగిసిన వాహనాలపై రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక పై పాత బండ్లు రోడ్డెక్కితే ఫైన్ విధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ గడువు ముగిసిన 9 వేలకు పైగా వాహనాలను వాహనాదారులు నడుపుతున్నారు. ఇవికాక వ్యవసాయ పనులకు వాడుతున్న ట్రాక్టర్లు 1,109, ఓమ్నీ బస్సులు 55, హర్వెస్టర్ వాహనాలు 68 ఉన్నాయి. వీటి తో పాటు కన్స్ట్రక్షన్ పనులకు వాడే వాహనాలు, మోపెడ్లు ఉన్నాయి. వ్యవసాయనికి వాడుకునే ట్రాక్టర్లు రోడ్డెక్కే అవకాశం తక్కువ కావడంతో వాహన యజమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ద్విచక్ర వాహనదారు లు, కార్లు మాత్రం రోడ్డెక్కక తప్పని పరిస్థితి. ఆ వాహనాలపై అధికారులు దృష్టిసారిస్తున్నా రు. తనీఖీల్లో వాటిని పట్టుకుని, వాహన య జమానులకు జరిమానా విధించనున్నారు.
జరిమానా ఇలా..
రిజిస్ట్రేషన్ వాలిడిటీ గడువు దాటితే వాహనదారలుకు జరిమానా మోత మోగనున్నది. కార్ల యజమానులు నిర్ణీత గడువులోపు రెన్యూవల్కు స్లాట్ బుక్ చేసుకుంటే గ్రీన్ ట్యాక్స్ రూ.5 వేలు, వాలిడిటీ పెంపు ఫీజు రూ.5,435.. ఇలా మొత్తంగా రూ.10,435 చెల్లించాల్సి ఉన్నది. గడువు దాటితే ప్రతి నెలా రూ.500 చొప్పున జరిమానా పడుతుంది. అలా ఎన్ని నెలలు గడిస్తే అన్ని నెలలు.. నెలకు రూ.500 చొప్పున చెల్లించాల్సిందే. ద్విచక్ర వాహనాలకు నిర్ణీత గడువులోపు అయితే గ్రీన్ ట్యాక్స్ రూ.వెయ్యి, వాలిడిటీ పెంపు ఫీజు రూ.2,435.. ఇలా మొత్తంగా రూ.3,435 ఉంది. గడువు దాటితే ఒక్కో వాహనానికి నెలకు రూ.300 చొప్పున ఫైన్ పడుతుంది.
భారీగా బకాయిలు..
జిల్లా లో 9 వేల వాహనాల వాలిడిటీ ముగియగా.. వీటీ రెన్యూవల్స్ పూర్తయితే రవాణాశాఖకు సుమారు రూ.1.70 కోట్ల ఆదాయం సమాకురనున్నది. దీంతో అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. దీనిలో భాగంగానే వాహనదారులను హెచ్చరిస్తున్నారు. ఆయా వాహనాలు రోడ్డెక్కి పట్టుబడితే యజమానులకు భారీగా జరిమానా విధించనున్నారు. అవసరమైతే బండిని సీజ్ చేస్తారు. ప్రస్తుతం రెన్యూవల్ చెల్లింపులు ఆన్లైన్ పద్ధతిలోనే కొనసాగుతుండగా ‘మీ సేవ’ కేంద్రాలు లేదా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ వెబ్ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ తేదీ రోజు సదరు వాహనాన్ని జిల్లాకేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయానికి తీసుకువస్తే.. సిబ్బంది వాహనాన్ని పరిశీలించి వ్యాలిడిటీ పెంచనున్నారు.
సకాలంలో చెల్లించాలి..
జిల్లాలో పరిధిలో టాక్స్ ప్లేట్ వాహనాలు 14,984 ఉండగా, వాటిలో 8,550 వాహనాలకు సంబంధించిన టాక్స్లు పెండింగ్లో ఉన్నాయి. పెం డింగ్లో ఉన్న పన్నులను వాహనదారులు సకాలంలో చెల్లించాలి. ఇకపై పన్ను కట్టని యజమానుల వాహనాలను సీజ్ చేస్తాం. అంతేకాకుండా నెలకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తాం. వాహనాల పన్నులను చెల్లించి రవాణా శాఖకు సహకరించాలి.
శ్రీనివాస్రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి, కామారెడ్డి