08-08-2025 01:46:03 AM
ఢిల్లీకి మూటలు మోయడమే రేవంత్ పని మాజీ మంత్రి హరీష్రావు దుబ్బాక ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
మెదక్, ఆగస్టు 7(విజయక్రాంతి): మేడిగడ్డను ఎండబెట్టి చంద్రబాబుకు గురుదక్షిణగా బనకచెర్లకు నీరు పారిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్రావు దుయ్యబట్టారు. గురువారం నర్సాపూర్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 20 నెలల రేవంత్ సర్కార్ మాటలకే పరిమితమైందన్నారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడకుండా మాజీ సీఎం కేసీఆర్ను తిట్టడమే పనికా పెట్టుకున్నారని, కమీషన్లు, కేసులు అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
ఢిల్లీకి మూటలు మోస్తూ చక్కర్లు కొడుతున్నాడని, పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. వృద్ధులకు పెన్షన్లు, తులం బంగారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 9 నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పటికైనా రేవంత్రెడ్డి బుద్ది తెచ్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ కార్పోరేషన్ చైర్మన్ దేవేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
మెదక్ జిల్లా కలెక్టర్కు సిగ్గు, శరం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్తా ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదక్లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గాంధీభవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ను చదవడం పనికిగా పెట్టుకున్నాడని, నకల్ కొట్టేందుకు అఖల్ కూడా ఆయనకు లేదన్నారు. అలాగే జిల్లాలో పనికిమాలిన మంత్రి ఉన్నాడని, కేవలం కమీషన్లు, పర్సంటేజీలు తీసుకోవడానికే ఉన్నారని విమర్శించారు. జిల్లాలో మంత్రి ఉండగా పెత్తనం మాత్రం మారో మంత్రిదని, అంతా కమీషన్లు పంచుకోవడానికే సరిపోతున్నారని ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి కలెక్టర్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.