07-10-2025 10:08:01 PM
బీసీ రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..
బీజేపీ ద్వంద నీతి, కుట్రలపై ప్రజలను చైతన్యం చేస్తాం..
జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్..
గజ్వేల్ (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 60 శాతానికి పైగా బలహీన వర్గాల జనాభా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం జాగృతి ఉద్యమించి బలహీన వర్గాల ప్రజల్లో కదలిక తెచ్చినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో వారి నుండి సంపూర్ణ మద్దతు దక్కుతున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయంలో కాంగ్రెస్ తన వంతు పాత్ర పోషించగా, బీజేపీ మాత్రం ద్వంద నీతి ప్రదర్శిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు.
ముఖ్యంగా 42 శాతం రిజర్వేషన్ పై బీజేపీ పార్టీ చీఫ్ మాట్లాడిన తీరు సిగ్గుచేటుగా ఉందని, పార్లమెంటులో బిజెపి స్పందించకపోవడం, గవర్నర్ వద్ద బిల్లు పెండింగులో ఉండడం ద్వారా బీజేపీ కుటిల యత్నాలు ప్రజలు గ్రహిస్తున్నట్లు చెప్పారు. కాగా 42 శాతం రిజర్వేషన్ పై ఈనెల 8వ తేదీన హైకోర్టులో విచారణ జరగుతున్నందున కాంగ్రెస్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీల నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ అమలు కోసం అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాలని, లేనిపక్షంలో ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని వివరించారు.